శబరిమల ఆలయంలో 10 మంది మహిళలను అడ్డుకున్న పోలీస్
కేరళ : శబరిమల ఆలయం తలుపులు శనివారం సాయంత్రం తెరుచుకోనున్న క్రమంలో ఆలయం లోకి ప్రవేశించేందుకు వచ్చిన పది మంది మహిళలను పోలీసులు తిప్పిపంపారు. వీరిని ఏపీకి చెందిన మహిళా భక్తులుగా భావిస్తున్నారు. శబరిమలలో పది నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు ప్రవేశించవచ్చని, పూజలు నిర్వహించవచ్చని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆలయం వద్ద ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆలయ పరిసరాల్లో పదివేల మంది పోలీసులను నియమించారు. కాగా శబరిమలను సందర్శించాలనే మహిళలు కోర్టు ఉత్తర్వులతో వస్తే భద్రత కల్పిస్తామని కేరళ దేవాదాయ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు. శబరిమల ఆలయం ఆందోళనలు చేపట్టే ప్రాంతం కాదు..తృప్తి దేశాయ్ వంటి సామాజిక కార్యకర్తలు తమ బలప్రదర్శన చేసే స్థలం కాదని చెప్పారు. ఏమైనా మహిళా భక్తులు కోర్టు ఉత్తర్వులతో రావాలని సూచించారు. మీడియా ప్రతినిధులు సైతం సంయమనం పాటించాలని, సంచలనం కోసం ప్రయత్నించే వ్యక్తులు, నేతల అత్యుత్సాహానికి సహకరించరాదని స్పష్టం చేశారు.
Comments
Post a Comment