అల్లర్లు జరగకుండా ఢిల్లీలో హై అలెర్ట్
న్యూఢిల్లీ :- పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మరింత హింసాకాండ పెచ్చరిల్లుతోందని ఇంటలిజెన్స్ అధికారులు జారీ చేసిన హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు బుధవారం హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్, అన్ని జిల్లాల డీసీపీలు, జాయింట్ కమిషనర్ల సమావేశంలో అల్లర్లు జరుగుతాయని ఇంటలిజెన్స్ చేసిన హెచ్చరికలపై సమీక్షించారు.
ఢిల్లీలోని శీలంపూర్, ముస్తఫాబాద్ ప్రాంతాల్లో పెద్దఎత్తున ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు చేసేందుకు సమాయత్తమయ్యారని ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ నగరంలోని 12 సున్నిత ప్రాంతాల్లో ఈ వారంలో అల్లర్లు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో నగరంలోని 12 సున్నిత ప్రాంతాల్లో సాయుధ పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు.
ఢిల్లీలో ఉన్న అమన్ కమిటీ సభ్యులతో కలిసి పోలీసులు అల్లర్లు జరగకుండా పెట్రోలింగ్ చేపట్టాలని నిర్ణయించారు. ఢిల్లీలోని త్రిలోక్ పురి, జామియానగర్, షమియానాస్, జామా మసీదు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగకుండా నివారించేందుకు వీలుగా మఫ్టీలో పోలీసులు పెట్రోలింగ్ చేపట్టారు.
Comments
Post a Comment