ఎపి దిశ చట్టం దేశవ్యాప్తంగా అమలుచేయాలి...
న్యూడిల్లీ: మహిళా రక్షణకై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లును దేశవ్యాప్తంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తూ దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మల్వాల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించేలా ఏపీ దిశ చట్టాన్ని తీసుకురావడం హర్షనీయమన్నారు. ఇటువంటి కేసులను 21 రోజుల్లోనే పరిష్కరించి దోషులకు జీవితఖైదు లేదా మరణదండన విధించే విదంగా ఎపి ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. ఇదే తరహాలో దిశ బిల్లును తక్షణమే దేశవ్యాప్తంగా తీసుకురావాలని ఆమె ప్రధాని మోదీకి లేఖలో డిమాండ్ చేశారు. మహిళల రక్షణపై కేంద్ర ప్రభుత్వం వైఖరి పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రేపిస్టులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ స్వాతి మల్వాల్ గత పది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే దిశ బిల్లును దేశవ్యాప్తంగా తీసుకొచ్చేంత వరకు తాను నిరాహార దీక్ష విరమించేది లేదని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉన్నప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుందని మృగాళ్ల అరాచకాలు అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు.
Comments
Post a Comment